Pattabhiram: తెలంగాణ నెంబర్ ప్లేట్ ఉన్న ఆటోలు బెజవాడలో తిరుగుతాయా?: టీడీపీ నేత పట్టాభిరామ్

  • వైసీపీ నేతల ప్రచార వీడియోలో లొసుగులు బయటపెట్టిన పట్టాభిరామ్
  • ఫేక్ వీడియోలు సృష్టించడానికి వైసీపీ యూనివర్సిటీ బాగా శిక్షణ ఇస్తుందని ఎద్దేవా
  • వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్ పై తీవ్ర విమర్శలు
TDP Leader Pattabhi Ram Press Meet

విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్ నోటివెంట ఏనాడూ నిజాలు రావని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. నిజాలు మాట్లాడితే నీ తల వేయి ముక్కలవుతుందని అవినాశ్ కు ఎవరన్నా శాపం పెట్టారేమో తెలియదు కానీ ఆయన నోటివెంట నిజమనే పదమే రాదని మండిపడ్డారు. ఈమేరకు విజయవాడలో సోమవారం కూటమి నేతలతో కలిసి పట్టాభిరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ.. వైసీపీ యూనివర్సిటీలో ఫేక్ వీడియోలు సృష్టించడం బాగా నేర్పిస్తారని ఎద్దేవా చేశారు. దేవినేని అవినాశ్ విడుదల చేసిన ఎన్నికల ప్రచార వీడియో మొత్తం అబద్ధమేనని ఆరోపించారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయించానని చెప్పుకుంటూ అవినాశ్ రిలీజ్ చేసిన ప్రచార వీడియో లొసుగులను బయటపెట్టారు. ఈ వీడియోలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన ఓ యువకుడిని తన మిత్రుడు ఆటోలో తీసుకెళుతుండగా నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడడం కనిపిస్తుంది. దీనిపై పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ఈ వీడియోలో ఉన్న ఆటో హైదరాబాద్ లో రిజిస్టర్ అయిందని, నెంబర్ ప్లేట్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. తెలంగాణ నెంబర్ ప్లేట్ తో ఉన్న ఆటోలు విజయవాడలో తిరుగుతున్నాయా అని ప్రశ్నించారు. వాస్తవానికి ఆ వీడియో మొత్తం హైదరాబాద్ లోనే తీశారని చెప్పారు. ఇలా ప్రతీదాంట్లోనూ అబద్ధాలు తప్ప అవినాశ్ నిజాలు మాట్లాడరని పట్టాభిరామ్ మండిపడ్డారు.

More Telugu News